Saturday, 27 July 2019

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు
న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.
సూర్యుడు
శ్రీ‌కాకుళం జిల్లా
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి
చంద్రుడు
ప‌శ్చిమ గోదావ‌రి
1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి
2. కోటిప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.
అంగార‌కుడు
కృష్ణ
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు
3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురి లాంటి నృసింహ క్షేత్ర దర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది
బుదుడు
ప‌శ్చిమ గోదావ‌రి
1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ
3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.
బృహ‌స్పతి
గుంటూరు
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి
3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.
శుక్రుడు
విశాఖ
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి,
పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు
3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.
శ‌ని
తూర్పగోదావ‌రి
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ
3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.
రాహువు, కేతువు
చిత్తూరు
1. శ్రీ కాళ‌హ‌స్తి
తూర్పుగోదావ‌రి
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి
కృష్ణ
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.
విశాఖ
4. సంప‌త్ వినాయ‌క స్వామి.
గుంటూరు
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి,
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
గుంటూరు జిల్లాలో పెద్దకాకాని...
సర్వేజనా సుఖినోభవంతు..
www.saisaranam.in
స్వస్తి..

Monday, 22 July 2019

తథాస్థు దేవతలు అంటే ఎవరు ?

* తథాస్థు దేవతలు అంటే ఎవరు ?

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మనచి జరుగుతుంది.☘🍀

Sunday, 21 July 2019

తిరుమల తిరుపతి ధ్వజస్తంభం కథ

కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల
పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల
ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం
చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్
రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.
వందల కంఠాలు"గోవిందా! గోవిందా!"
అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి
నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి
గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ
చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.
కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి.
చుట్టూ చూశాడు. వేలాది యువతులు
హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ
తన్మయులైనారు.

అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి,
ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి
నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు,
ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ
మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు
దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు
దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి
తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో
పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి
అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను,
పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు
బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ
బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే
మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి.
పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ  లోయలో పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.
ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ
సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..
సూర్యాస్తమయం లోగా
ట్రాలీ తిరుమల చేరిపోయింది.
వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో
గోవిందా..గోవిందా..నామస్మరణతో
తిరుమల కొండ ప్రతిధ్వనించింది!
☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం
దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న
ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు
క్షేమంగా చేరుకున్నాయి👌

🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?

నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు
టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు.
అందులో భాగంగానే  ధ్వజస్థంభానికి బంగారు
తాపడానికి పాలిష్ చేయడం.
నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన
ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు
ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.
ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!
అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!
ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల
గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో
అసలు విషయం బయటపడింది.
ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే
ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో
ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు?
మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది?
కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది.
రేపో మాపో అది కూలిపోవచ్చు!
మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?
వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో
చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు
బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు!
కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్!
స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.
స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం
జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.
అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం"
అని ప్రకటించారు👌
ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!

🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం
ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.
ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,
కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న
ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక
కల్గిన టేకు చెట్టు అయివుండాలి.
ఎక్కడ? ఎక్కడ?
ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?
☘పాత మాను గురించి తెలుసుకుంటే
దొరుకుతుంది అని 190 సంవత్సరాల
రికార్డులన్నీ పరిశీలిస్తే..
ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు.
మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి
నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం.
ఈ కొద్ది రోజుల్లో మనం.....
ఇది చేయగలమా????ప్రశ్నలు???

🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన
ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు
ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు
రేడియోలో విన్నాను. అటువంటి మానులు
కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.
మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!
వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,
అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా
ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో
కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు
కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి
వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.
ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.
ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా
ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు.
సమస్య అక్కడితో అయిపోలేదు.
దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని
మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి
తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే
బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..
సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం
మాకు ప్రసాదించండి అని..దుంగల్ని
క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు.
ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ
బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు
లేకుండా తిరుమల చేరుకుంది!
1982 జూన్ 10వ తేదీన
ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!

🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్
యజమానికి 70 వేల రూపాయల చెక్కును
అందించారు! యజమాని..
"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు
ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"
అని దానిని తిరస్కరించారు!
డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.
స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను
సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!
అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో
కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన
ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి
సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..
ఆయన రెండు చేతులూ జోడించి
ఆనందడోలికల్లో మునిగిపోయారు!
               🕉
www.saisaranam.in

Monday, 8 July 2019

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

*ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతికీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం.. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని.

ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.

లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేల కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒక పువ్వులు పెడితే మంచిది.

గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రాగి రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.

ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది. దేవుడి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన లక్ష్మి యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును.

*|| ఓం నమః శివాయ ||*

Friday, 21 June 2019

పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం

*పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం.....*

ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు.
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి
కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. .

మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో..తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం.

ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,
ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు.
మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము
ఈ విధముగా ఉంది.
మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన
సుందర వల్లి, దేవయానీ అమ్మలు.
వీరు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు.
మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు.
మన పురాణములలో చెప్పే వాఖ్యానములకు
అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి.
అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు.
వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెతున్నాయి

అయితే ఒక రోజు సుందరవల్లి, దేవయానీ (అమృత వల్లి) అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు.
అప్పుడు స్వామి అమృత వల్లితో 'నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు.
తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను'
అని అభయం ఇస్తారు.
అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి ఇంద్రుడిని కలిసి ' నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది' అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి
వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు.
ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది.

ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు
అన్నీ తానై సాకుతుంది.
అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో 'యానై' అంటే ఏనుగు).
అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది.
ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు.

తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు.
అది వల్లీ కళ్యాణ ఘట్టం.
వేరే అఖ్యానంలో వివరిస్తాను.
ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు.
వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.
ఈ క్రమంలో తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత,
మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు.

స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, తిరిగి వారి రూపం వచ్చి,
వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు.
అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు.

అక్కడే ఉన్న బ్రహ్మకి, శ్రీ మహా విష్ణువుకి ఇంద్రుడు
తన ఈ కోర్కెని తెలియజేస్తాడు .
బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు,
స్వామి అంగీకరిస్తారు.
అటు పై సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది.
శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది.

అంతే కాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు.
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు.
దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు.
రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

*|| ఓం నమః శివాయ ||*

Friday, 19 April 2019

శ్రీ కృష్ణ జాంబవంతుల యుద్ధం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
   ☆శ్రీకృష్ణుడి నిందావిమోచన క్షేత్రం☆
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం... పురాణాల్లోని ఆసక్తికర ఘట్టాలు. ఆ ఐతిహ్యానికి సాక్ష్యంగా నిలిచినచోటే నెల్లూరు జిల్లాలోని మన్నారుపోలూరు. ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతీ సత్యభామా సమేతంగా వెలిశాడు.

రామభక్తుడైన జాంబవంతుడికి స్వామితో యుద్ధం చేయాలనే విచిత్రమైన కోరిక కలిగిందట. ఆ రోజు వస్తుందని స్వామి ఆయన్ను ఆశీర్వదించాడు కూడా. అమిత పరాక్రమశాలి అయిన జాంబవంతుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించే శక్తి ఒక్క శ్రీరామచంద్రుడికి తప్ప మరెవరికీ ఉండదు. ద్వాపరయుగంలో గుహల్లో ఉంటున్న జాంబవంతుడిని సాక్షాత్‌ రామచంద్రమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణపరమాత్మ చేరి యుద్ధం చేస్తాడు. తన నీలాపనిందను పోగొట్టుకోవడానికి స్వామి యుద్ధం చేసే ఘటన శమంతకమణోపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. రామచంద్రమూర్తి దర్శనమివ్వబోతున్నాడన్న వార్త విని ఆంజనేయుడూ ఆ చోటుకి వచ్చాడట. ఈ కథనం జరిగిన స్థలమే మన్నారుపోలూరు అని ప్రసిద్ధి. మణిమండప క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన సత్యభామా జాంబవతీ సమేత అళఘు మల్లారి కృష్ణస్వామి ఆలయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మన్నారుపోలూరు గ్రామంలో ఉంది. ఇక్కడే జాంబవంతునికి కోదండరాముడై దర్శనం ఇచ్చినందువల్ల ఈ క్షేత్రానికి మణి మండప క్షేత్రమని పేరొచ్చింది. జాంబవంతుడితో స్వామి మల్లయుద్ధం చేసినందున స్వామిని మల్లహరి అని పిలిచారట. ఆ మల్లహరి మల్లారిగా మారి తరువాత ‘మన్నారుపోలూరు’గా ఆ గ్రామం పేరు స్థిరపడింది. వైష్ణవ భక్తాగ్రేసరులైన పన్నిద్దరాళ్వార్లు స్తుతించిన 108 దివ్య తిరుపతులలో ఈ మణిమంటప క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం పూర్వం దండకారణ్యంలో భాగంగా ఉండేదని చెబుతారు. బ్రహ్మ కాంచీపురంలో యాగమాచరించేప్పుడు దండకారణ్య ప్రాంతపు ఉత్తర ఈశాన్యపు సరిహద్దును నిర్ణయించుకునేందుకు దీనిని చిహ్నంగా పెట్టుకొన్నాడంటారు. అందుకు గుర్తుగా కాళంగి నదీ ప్రాంతం నుంచి శ్రీకాళహస్తి ప్రాంతపు తొట్టంబేడు తిప్పలు వరకు ఒక ఎత్తైన కట్ట అగడ్తవలె ఉండేదట. దీనినే కోటకట్ట అని ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ఇది నేడు శిథిలమై కనిపిస్తోంది. బహుశా ఇదే బ్రహ్మయాగం నాటి ఉత్తర ఈశాన్యపు సరిహద్దుగా ఉండవచ్చనీ, ఇక్కడే గోమహర్షి తపస్సు చేసి వైకుంఠ ప్రాప్తి పొందాడనీ చెబుతారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పర్వదినాలు విశేషంగా జరుగుతాయని ఆలయ అర్చకులు వల్లీపురం చక్రవర్తి మురళీకృష్ణన్‌ చెప్పారు.
స్థల పురాణం
సత్రాజిత్తు దగ్గర ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న నిందను నివృత్తి చేసుకోవడానికి కృష్ణుడు తన సైన్యంతో అడవులకు వెళతాడు. అక్కడ కనిపించిన సింహపు జాడలను బట్టి ఓ గుహలో ప్రవేశించి లోపల ఓ ఎలుగుబంటి దగ్గర మణి ఉండటాన్ని గమనించి జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేస్తాడు. చివరకు కృష్ణుడిని శ్రీరాముడిగా గుర్తించడటం, జాంబవంతుడు తన కూతురు జాంబవతినీ, శమంతకమణినీ స్వామికి ఇవ్వడం జరుగుతాయి. దాన్ని సత్రాజిత్తుకు ఇవ్వడం ద్వారా స్వామి నిందావిముక్తుడయ్యాడు. ఆ యుద్ధం జరిగిన చోటు ఇదే అవడం వల్ల ఈ క్షేత్రాన్ని నిందావిమోచన క్షేత్రంగా పిలుస్తారు. సాక్షాత్తూ జాంబవంతుడే ఇక్కడ మూలవిరాట్టులను ప్రతిష్ఠించాడని చెబుతారు. జాంబవంతుడే క్షేత్రపాలకుడిగా ఉండటం మరో విశేషం. బ్రహ్మాండపురాణంలో క్షేత్ర ప్రశస్తి విస్తృతంగా ఉంది.
పదో శతాబ్దం నుంచీ...
ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. చోళ రాజుల శిల్ప కళా వైభవాన్ని ఇక్కడ చూడొచ్చు. మనుమసిద్ధి హయాంలో, వెంకటగిరి రాజుల కాలంలో ఆలయం వైభవోపేతంగా ఉంది. వెంకటగిరి పాలకులు, దేవాలయానికి 5 గ్రామాలను విరాళంగా ఇచ్చారు. భారత ప్రాచీన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన భూగృహం ఒకటి దేవాలయ ప్రాంగణంలో బయట పడింది. సౌందర్యవళ్లి అనేపేరుతో వెలసిన రుక్మిణీదేవి ఆలయం ప్రధానాలయానికి దక్షిణ భాగంలో ఉంది. ఒకప్పుడు గరుత్మంతుడు తన కంటే బలవంతుడు ఎవరూలేరని లోలోపల గర్వపడుతూ ఉండేవాడట. అది గమనించిన స్వామి గరుడుడి గర్వమణచదలిచి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. స్వామి ఆజ్ఞమేరకు హిమాలయానికి వెళ్లి ఆంజనేయస్వామి తపస్సుకు భంగం కలిగించడంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయుడు గరుడుడిని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పికి తాళలేక గరుడుడు ఏడుస్తూ దీనంగా స్వామితో మొరపెట్టుకుంటున్నట్లుగా, ఒక చెంప వాచి ఉన్న గరుడుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. మళ్లీ స్వామి ఆజ్ఞమేరకు గరుడుడు పోయి ఆంజనేయుడితో ‘స్వామి కోదండరామస్వామిగా జాంబవంతుడికి దర్శనమిస్తున్నాడు రమ్మ’ని పిలువమనగా అది విన్న ఆంజనేయుడు సంతోషంగా వెంటనే వచ్చి దాసాంజనేయుడై ఉన్న విగ్రహమూ మనకు కనిపిస్తుంది. దీన్ని గర్వభంగ క్షేత్రమనీ పిలుస్తారు.
మరిన్ని విశేషాలు
ద్వారపాలకులైన జయవిజయులతో పాటూ విష్వక్సేన, సుగ్రీవుల బొమ్మలూ, రావణుడు నరకడం వల్ల ఒకరెక్కేఉన్న జఠాయువు, శ్రీనివాస మూర్తులను ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిన ఆళ్వార్లతో పాటూ 9.5 అడుగుల ఎత్తుతో కన్నీరు కారుస్తూ కన్పించే గరుత్మంతుని విగ్రహం, అదే ఎత్తులో ఉన్న జాంబవంతుని విగ్రహాలూ ఆకట్టుకుంటాయి. ఆలయ గోపురం మీద తిరుమల గోపురంలోలా సింహాల బొమ్మలు ఉంటాయి.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
               వేదాంతం కిరణ్ కుమార్
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

చిత్రగుప్తుడు ఎవరు?

పురాణాల (ముఖ్యంగా పద్మ పురాణం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం మొదలైనవి) ప్రకారం, చిత్రగుప్తుడు బ్రహ్మ దేవుని మానసపుత్రుడు (మనస్సు నుంచి ఉద్భవ...